విజయనగరం జిల్లాలో ప్రైవేటు బస్సుకు అగ్నిప్రమాదం.. తప్పిన పెను ప్రమాదం

  • విజయనగరం జిల్లాలో దగ్ధమైన ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు
  • డ్రైవర్ అప్రమత్తతతో సురక్షితంగా బయటపడిన 37 మంది
  • ప్రయాణికుల్లో ఒడిశాకు చెందిన ఎమ్మెల్యే కూడా ఉన్నట్లు గుర్తింపు
  • టైరు పేలడమే ప్రమాదానికి కారణంగా ప్రాథమిక అంచనా
ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లాలో పెను ప్రమాదం త్రుటిలో తప్పింది. 37 మంది ప్రయాణికులతో  వెళ్తున్న ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అగ్నికి ఆహుతైంది. అయితే డ్రైవర్ అప్రమత్తతతో ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన ఈరోజు తెల్లవారుజామున రామభద్రపురం మండలంలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే... ఆరెంజ్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు భువనేశ్వర్ నుంచి మల్కాన్‌గిరికి వెళ్తోంది. ఈ క్రమంలో రామభద్రపురం మండలం తారాపురం గ్రామ సమీపంలోకి రాగానే బస్సు వెనుక టైరు ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో నిప్పురవ్వలు చెలరేగి బస్సుకు మంటలు అంటుకున్నాయి. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ దశరథ్ బస్సును రోడ్డు పక్కన నిలిపివేసి, ప్రయాణికులందరినీ వెంటనే కిందకు దించేశాడు.

ప్రయాణికులు దిగిన కొద్దిసేపటికే మంటలు బస్సు మొత్తం వ్యాపించి పూర్తిగా కాలి బూడిదైంది. ప్రమాద సమయంలో బస్సులో ఒడిశాకు చెందిన ఓ ఎమ్మెల్యే కూడా ఉన్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న అగ్నిమాపక, పోలీసు సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు.

Orange Travels
Vizianagaram district
bus fire
Andhra Pradesh
private bus accident
Ramabhadrapuram
Odisha MLA
bus accident

More Telugu News